మహిళా శక్తికి దర్పణం : ఐకేపీ డైరీ ఆవిష్కరణలో షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా: మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ప్రగతి పథంలో పయనిస్తుంది. ఇందుకు ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సంఘాల కృషి వెలకట్టలేనిది” అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కొనియాడారు.
ఆదివారం కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన ఐకేపీ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గతంలో మహిళలు కేవలం గడప దాటడానికే ఇబ్బంది పడేవారని, కానీ ఇందిరమ్మ స్ఫూర్తితో వచ్చిన ఐకేపీ ద్వారా నేడు మహిళలు స్వయం ఉపాధితో లక్షల రూపాయల టర్నోవర్ చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. మీరు కేవలం గృహిణులు కాదు, కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తున్న ఆర్థిక యోధులు అని ఆయన ప్రశంసించారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి కట్టుబడి ఉందని, గతంలో ప్రకటించిన హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. పావలా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనలో మహిళలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ఐకేపీ సిబ్బంది గ్రామగ్రామాన తిరిగి మహిళలను సంఘటితం చేస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఈ డైరీ, క్యాలెండర్ కేవలం తేదీల కోసం మాత్రమే కాకుండా, ఈ ఏడాదిలో ఐకేపీ సాధించబోయే విజయాలకు సూచికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
కామారెడ్డి తన సొంత గడ్డని, ఇక్కడి ప్రజల కోసం, ముఖ్యంగా మహిళల సంక్షేమం కోసం ఎంతైనా కష్టపడతానని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు.
ఐకేపీ కార్యాలయాల భవన నిర్మాణాలు, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
